రాహుల్‌ విమాన ఘటన పైలట్ల తప్పిదమే

1 Sep, 2018 05:36 IST|Sakshi

ముంబై: కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా హుబ్లీలో రాహుల్‌ గాంధీ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని డీజీసీఏ పేర్కొంది. ఇందులో కుట్రకోణమేదీ లేదని స్పష్టం చేసింది.  ఏప్రిల్‌ 26న పదిసీట్ల సామర్థ్యమున్న విమానం ల్యాండింగ్‌కు ముందు ఒక్కసారిగా ఎడమవైపుకు వంగడంతో రాహుల్‌ సహా లోపలున్న వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ‘చార్టెడ్‌ విమానం వీటీ–ఏవీహెచ్‌ ఆటోపైలట్‌ మోడ్‌లో ఉన్న సమయంలో విమానం ఎత్తు హఠాత్తుగా 125 అడుగుల.. తర్వాతి 9 సెకన్లలోనే మరో 610 అడుగులు కిందకొచ్చింది. దీంతో విమానం 65 డిగ్రీలు పక్కకు ఒరిగింది’ అని డీజీసీఏ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రాహుల్‌తోపాటు ఆయన మిత్రుడు కౌశల్‌ విద్యార్థి్థ, ఇద్దరు పైలట్లు, క్యాబిన్‌ సిబ్బంది, ఇంజనీర్‌ ఉన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. మరోవైపు, రాహుల్‌ శుక్రవారం ఢిల్లీ నుంచి కైలాస్‌ మానససరోవర్‌ తీర్థ యాత్రకు బయలుదేరారు. ఈ సుదీర్ఘయాత్ర 12 నుంచి 15 రోజుల పాటు సాగనుంది. కైలాస పర్వతంపై ఉన్న శివుణ్ణి దర్శిస్తారు.

>
మరిన్ని వార్తలు