మోదీ వీడియో కాన్ఫరెన్స్‌కు విజయన్‌ గైర్హాజరు

27 Apr, 2020 11:10 IST|Sakshi

తిరువనంతపురం : కరోనా వైరస్‌ పరిస్థితుల గురించి చర్చించేందకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ పాల్గొనలేదు. అయితే కేరళ ప్రభుత్వం తరఫున కేంద్రానికి రాతపూర్వకంగా సూచనలు అందజేయనున్నారు. సీఎం తరఫున కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టామ్‌ జోస్ మాత్రం ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్టుగా సమాచారం. కాగా, ‘నేటి సమావేశంలో కేరళ సీఎంకు మాట్లాడే సమయం కేటాయించలేదు. సీఎస్‌ టామ్‌ జోస్‌ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

అయితే ప్రధాని మోదీ సీఎంలతో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్‌లో.. మే 3 తరువాత లాక్‌డౌన్‌ను కొనసాగించడమా? లేక దశలవారీగా ఎత్తివేయడమా? అనే విషయంపై చర్చించే అవకాశముంది. అలాగే లాక్‌డౌన్‌ ఎత్తివేతపై అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా వారు చర్చించే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. కరోనా నియంత్రణ చర్యలపై చర్చించేందుకు ప్రధాని మోదీ.. మార్చి 20, ఏప్రిల్‌ 11 తేదీల్లోనూ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 468 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు ప్రభుత్వం తెలిపింది. అందులో 342 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, ముగ్గురు మృతిచెందారు. ప్రస్తుతం కేరళలో 123 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

చదవండి : ప్రారంభమైన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌


 

మరిన్ని వార్తలు