-
ఫార్మా పీఎస్యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ
సాక్షి, న్యూఢిల్లీ : ముందస్తు లాక్డౌన్తో దేశంలో కరోనా మహమ్మారిని కట్టడి చేయగలిగామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వైరస్ నియంత్రణలో భాగంగా ఆరోగ్య మౌలిక వసతులను పెద్ద ఎత్తున విస్తరించామని చెప్పుకొచ్చారు. ఆదివారం ఫార్మా రంగ అధినేతలు, ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. కోవిడ్-19 సంక్షోభాన్ని సమర్ధంగా ఎదుర్కోవడంలో ఫార్మా రంగం దీటుగా పనిచేసిందని కొనియాడారు.
వరల్డ్ ఫార్మాసీ హబ్గా భారత్ అంతర్జాతీయంగా గుర్తింపు సొంతం చేసుకుందన్నారు. గత రెండు నెలల్లో భారత ఫార్మా పరిశ్రమ 120కి పైగా దేశాలకు కీలక ఔషధాలను సరఫరా చేసిందని గుర్తుచేశారు. ఫార్మా పీఎస్యూల్లో పెట్టుబడుల ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఫార్మా పరిశ్రమ విస్తరణకు, బలోపేతానికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు.