వైఎస్సార్సీపీని కోరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో మద్దతివ్వాలని కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కోరారు. మంగళవారం ఈ మేరకు పార్లమెంటులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలతో ఆయన చర్చించారు. జీఎస్టీ బిల్లుపై మద్దతుకోసం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలని ప్రధానమంత్రి సూచించారని, అందులో భాగంగా మద్దతు కోరుతున్నామని వెంకయ్యనాయుడు వైఎస్సార్సీపీ ఎంపీలకు చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లుకు తాము మద్దతు పలుకుతామని హామీఇచ్చినట్టు ఎంపీలు తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో ముఖ్యం: మేకపాటి
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో రానున్న ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలిపే అంశంపై మేకపాటి రాజమోహన్రెడ్డి సానుకూలంగా స్పందిం చారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలో ఈ అంశంపై అనేకమార్లు దీక్షలు, ధర్నాలు చేశారని, ప్రత్యేకహోదా వస్తే తప్ప ఏపీకి భవిష్యత్తు లేదన్నదే తమ భావనని ఆయన వివరించారు. ‘‘బిల్లు ఎవరు పెట్టారన్నది ముఖ్యం కాదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం ముఖ్యం’’ అని మేకపాటి అన్నారు.