సోనియా కోటలో కాంగ్రెస్‌పై మోదీ ఫైర్‌

16 Dec, 2018 16:09 IST|Sakshi

లక్నో : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ నియోజకవర్గం రాయ్‌బరేలిలో ఆదివారం తొలి ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. రాఫేల్‌ వివాదం, అగస్టా స్కామ్‌ సహా పలు అంశాలపై కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడికి దిగారు. కాంగ్రెస్‌ సైనిక పాటవాన్ని బలహీనపరిచే చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు.

రాయ్‌బరేలి ప్రాంతానికి ఆ పార్టీ చేసిందేమీలేదని దుయ్యబట్టారు. సర్జికల్‌ స్ర్టైక్స్ పై అనుమానాలు వ్యక్తం చేసిన పార్టీ మన సైన్యాన్ని విశ్వసించకుండా ప్రత్యర్థి చెబుతున్న ధరలను నమ్ముతున్నాయని రాఫెల్‌ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. అగస్టా స్కామ్‌లో నిందితుడు క్రిస్టియన్‌ మైఖేల్‌ను రక్షించేందుకు కాంగ్రెస్‌ తమ న్యాయవాదులతో పోరాడుతోందని ఎద్దేవా చేశారు.

రాయ్‌బరేలిలో మోడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నిర్మించే క్రమంలో 5000 మంది ఉద్యోగులను నియమించాలని నిర్ణయించగా కేవలం అందులో సగానికి మాత్రమే కాంగ్రెస్‌ హయాంలో నియామకాలు జరిగాయన్నారు. 2014లో ఫ్యాక్టరీలో కొత్తగా ఎవరినీ రిక్రూట్‌ చేసుకోలేదన్నారు. మోదీ తన పర్యటనలో భాగంగా మోడరన్‌ కోచ్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. ఫ్యాక్టరీలో తయారైన 900వ కోచ్‌కు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

మరిన్ని వార్తలు