ప్లాస్టిక్‌పై పోరాడదాం

26 Aug, 2019 03:41 IST|Sakshi

మన్‌కీబాత్‌లో మోదీ పిలుపు

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ 150వ జయంతి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్లాస్టిక్‌పై పోరాటానికి సిద్ధం కావాలని ప్రధాని మోదీ ప్రజలను కోరారు. వచ్చే అక్టోబర్‌ 2వ తేదీని ప్లాస్టిక్‌ రహిత దినంగా పాటించాలని ఆకాశవాణిలో ప్రసారమయిన మాసాంతపు మన్‌కీబాత్‌లో ఆయన కోరారు. వచ్చే దీపావళి పండుగ నాటికి ప్లాస్టిక్‌ వ్యర్థాలను లేకుండా చేయాలన్నారు. సెప్టెంబర్‌ 11వ తేదీ నుంచి మొదలయ్యే వార్షిక ‘స్వచ్ఛతే సేవ’లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

వచ్చే నెలలో దేశవ్యాప్తంగా జరగనున్న ‘పోషణ్‌ అభియాన్‌’లో భాగస్వాములై చిన్నారులు, మహిళలకు పోషకాహారం అందించాలని కోరారు. డిస్కవరీ చానెల్‌లో ప్రసారమయిన ‘మ్యాన్‌ వెర్సస్‌ వైల్డ్‌’ ఎపిసోడ్‌లలో సాహసికుడు బేర్‌ గ్రిల్స్‌ హిందీని ఎలా అర్థం చేసుకోగలిగారని పలువురు అనుమానం వ్యక్తం చేయడంపై ఆయన మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతే తమకు సాయపడిందన్నారు. నేను హిందీలో మాట్లాడిన మాటలను గ్రిల్స్‌ చెవిలో ఉండే పరికరం వెంటవెంటనే గ్రహించి అతడికి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసి వినిపిస్తుంది. ఇదంతా సాంకేతికత వల్ల సాధ్యమైన అద్భుతం..’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు