సహేతుక విధానం ఉండాలి

12 Apr, 2018 02:42 IST|Sakshi

ముడిచమురు ధరలను నిర్ణయించడంపై మోదీ

కృత్రిమంగా ధర మార్పుతో దిగుమతిదారులకు ఇబ్బందులు

ఐఈఎఫ్‌ సభ్య దేశాల సదస్సులో ప్రధాని ప్రసంగం  

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను కృత్రిమంగా పెంచడం, తగ్గించడం తో దిగుమతిదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు. కృత్రిమంగా ధరలను మార్చడం ఎగుమతిదారుల స్వీయ ప్రయోజనాలకే భంగకరమన్నారు. ముడిచమురు ధరలను నిర్ణయించేందుకు అంతర్జాతీయంగా ఏకాభిప్రాయంతో హేతుబద్ధమైన విధానం తీసుకురావాలన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఫోరం (ఐఈఎఫ్‌) సభ్యదేశాల ఇంధన శాఖ మంత్రుల 16వ సదస్సులో మోదీ ప్రసంగించారు.

సౌదీ అరేబియా, ఇరాన్‌ సహా ఒపెక్‌(ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ద పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌) సభ్య దేశాలు ఈ సదస్సులో పాలుపంచుకున్నాయి. ‘ముడిచమురు, గ్యాస్‌ మార్కెట్లు పారదర్శకంగా ఉండేలా చూడాలి. అప్పుడే మానవాళి ఇంధన అవసరాన్ని మనం పూర్తిస్థాయిలో తీర్చగలం’ అని మోదీ అన్నారు. వినియోగ, ఉత్పత్తిదారుల మధ్య పరస్పర సహకార వాతావరణం ఉండాలనీ, ఇంధనం అందరికీ అందుబాటుధరల్లో ఉన్నప్పుడే మార్కెట్‌ పెరిగి ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.

పూలే, అంబేడ్కర్‌ కలల సాకారానికి కృషి
దళిత నాయకుడు అంబేడ్కర్, సంఘ సంస్కర్త జ్యోతిబా పూలేల స్వప్నాలను సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని  మోదీ ఉద్ఘాటించారు. పార్టీ నేతలతో ఆయన ఆడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఫోన్‌లో మాట్లాడారు. ఏప్రిల్‌ 18ని స్వచ్ఛ భారత్‌ పండుగగా, 20ని ఉజ్వల దినోత్సవం గా, 24ని పంచాయతీ రాజ్‌ దినోత్సవంగా, 28ని గ్రామ శక్తి దినోత్సవంగా జరుపుతు న్నామనీ, ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారికి సూచించారు. రైతులు, పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలపై ప్రచారం చేయాలన్నారు.
ఢిల్లీలో ఐఈఎఫ్‌ సభ్యదేశాల సదస్సులో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

మరిన్ని వార్తలు