మామల్లాపురం : ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు విలువైన బహుమతులు ఇవ్వనున్నారు. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా వీరి బేటీ అనధికారికంగా జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిన్పింగ్కు ప్రధాని మోదీ భారతీయ సంప్రదాయం ఉట్టిపడే కళాకండాలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఆరుగడుల ఎత్తుండే దీపపు స్తంబాలు, మూడడగుల ఎత్తుండే తంజావూరు పెయింటింగ్లను కానుకగా అందజేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ బహుమతులు తమిళనాడు హస్తకళ నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఉండనున్నాయి. బంగారం పూత పూసిన ఇత్తడి దీపపు స్తంబాలు ఆరుగడుల ఎత్తు, 108 కేజీల బరువు ఉంటాయి. వీటిని తయారు చేయడానికి 12 రోజులు పట్టింది. కలపతో తయారు చేసిన మూడు అడుగుల ఎత్తున్న తంజావూరు పెయింటింగ్లో నాట్యం చేస్తున్న సరస్వతి దేవితో పాటు, సంగీతం ప్రాముఖ్యాన్ని తెలియజేసే పరికరాలను ఉంచారు. దీనిని తయారు చేయడానికి 45 రోజులు పట్టినట్లు తెలిసింది.