‘జలరవాణా’తో అవకాశాలు

15 Apr, 2016 00:49 IST|Sakshi
‘జలరవాణా’తో అవకాశాలు

కొత్త ప్రాజెక్టులతో కోటిమందికి ఉపాధి
♦ మారిటైమ్ సదస్సులో ప్రధాని మోదీ
 
 ముంబై: దేశంలోని జలరవాణా అభివృద్ధి, అనుసంధానానికి కేంద్రం కట్టుబడి ఉందని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోదీ గురువారం పిలుపునిచ్చారు. ముంబైలో మొదటి మారిటైమ్ ఇండియా సమిట్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ... ఓడరేవుల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు సేకరించాలని నిర్ణయించామని చెప్పారు. సముద్రతీర ప్రాంత అభివృద్ధికి ఇదే సరైన సమయమన్నారు. ఓడరేవుల సామర్థ్యాన్ని 2025 నాటికి 140 కోట్ల టన్నుల నుంచి 300 కోట్ల టన్నులకు పెంచడమే లక్ష్యమని చెప్పారు. ఎగుమతి, దిగుమతుల సామర్థ్యాన్ని అందుకునేందుకు ఐదు కొత్త ఓడరేవుల్ని నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. భారతీయ నౌకా పరిశ్రమ అభివృద్ధి కోసం సుదీర్ఘ కసరత్తుకు కట్టుబడి ఉన్నామని, పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని జారవిడుచుకోవ ద్దని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కరే... దేశ జల, నదీ రవాణా విధానానికి రూపకర్తని చెప్పారు.

 10 ఏళ్లలో కోటిమందికి ఉపాధి
 మారిటైమ్ విభాగంలో 250 ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం నౌకాయాన శాఖ ఆహ్వానిస్తోందని తెలిపారు. 12 ప్రధాన ఓడరేవుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఇందులో ఉన్నాయని చెప్పారు. వీటిలోని 100 ప్రాజెక్టులు సాగరమాల పథకంలో భాగంగా నిర్మిస్తారని మోదీ వెల్లడించారు. ఇవి అమలైతే కోటి మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయన్నారు.సాగరమాలకు సంబంధించి జాతీయ విధానాన్ని ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో నౌకాయాన మంత్రి నితిన్ గడ్కారీ మాట్లాడుతూ.. పోర్టుల అభివృద్ధికి ఉద్దేశించిన సాగరమాల ప్రాజెక్టు కాలపరిమితిని పదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.

 ఈనామ్ ఆవిష్కరణ
 ఢిల్లీలో జరిగిన మరో కార్యక్రమంలో జాతీయ వ్యవసాయ మార్కెట్ పోర్టల్ (ఈనామ్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీనిద్వారా ప్రస్తుతానికి తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లోని 21 మార్కెట్లను అనుసంధానిస్తారు.

మరిన్ని వార్తలు