ఆరోగ్య బీమా నేడు ప్రారంభం

23 Sep, 2018 04:07 IST|Sakshi

జార్ఖండ్‌లో ప్రధాని మోదీ చేతులమీదుగా..

న్యూఢిల్లీ: దేశంలోని 10.74 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమా కల్పించే ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై)ను ప్రధాని మోదీ నేడు జార్ఖండ్‌లో ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.5 లక్షల చొప్పున బీమా కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని 8.03 కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లోని 2.33 కోట్ల కుటుంబాలు వెరసి దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు.

తొలుత ఈ పథకానికి ఆయుష్మాన్‌ భారత్‌–జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్‌(ఏబీ–ఎన్‌హెచ్‌పీఎం)గా నామకరణం చేసినప్పటికీ, ఆ తర్వాత పీఎంజేఏవైగా పేరు మార్చారు. ఈ పథకానికి 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అంగీకరించాయనీ, తెలంగాణ, పంజాబ్, ఒడిశా, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలు పీఎంజేఏవై అమలుకు ముందుకు రాలేదన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు గుర్తింపు పత్రంగా ఆధార్‌ లేదా ఓటర్‌ కార్డు లేదా రేషన్‌ కార్డు ఇస్తే సరిపోతుందన్నారు. ఈ పథకంలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు mera.pmjay.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చనీ, లేదంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 14555కు కాల్‌ చేయవచ్చని వెల్లడించారు.

మరిన్ని వార్తలు