‘బ్రిక్స్‌’ కోసం బ్రెజిల్‌కు మోదీ

13 Nov, 2019 03:24 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్రిక్స్‌ దేశాల 11వ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ మంగళవారం బ్రెజిల్‌ వెళ్లారు. ఈ సమావేశాలు బుధ, గురువారాల్లో జరగనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిరోధక చర్యలను బలోపేతం చేయడం, ఆ దిశగా సహకారం అందించుకోవడం, డిజిటల్‌ ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల్లో సంబంధాలను పటిష్టం చేయడం వంటి పలు అంశాలపై ఈసారి బ్రిక్స్‌ సమావేశాలు దృష్టి సారించాయని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘సరికొత్త భవిష్యత్‌ కోసం ఆర్థిక అభివృద్ధి’ అనే అంశంపై వివిధ దేశాల అధినేతలతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరమ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తానని.. బ్రిక్స్‌ బిజినెస్, న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకులతో చర్చలు జరుపుతానని వెల్లడించారు. బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారో, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ వేర్వేరుగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. బ్రెజిల్‌తో సంబంధాలు మెరుగుపరిచేందుకు తన పర్యటన దోహదపడుతుందని మోదీ పేర్కొన్నారు. కాగా, 2014 నుంచి మోదీ బ్రిక్స్‌ సదస్సుల్లో పాల్గొనడం ఇది ఆరోసారి. 

మరిన్ని వార్తలు