‘చైనా ట్విటర్‌’ అకౌంట్‌ మూసేసిన ప్రధాని 

2 Jul, 2020 09:10 IST|Sakshi

న్యూఢిల్లీ:  చెనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపట్టిన∙నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా సామాజిక మాధ్యమమైన వీబోని వీడాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైంది. చైనా ట్విట్టర్‌గా పిలిచే వీబోలో ఉండే వీఐపీలు అకౌంట్‌ మూసివేయడానికి జరిగే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. అకౌంట్‌ డీయాక్ట్‌వేట్‌ చేయడానికి వీబో నుంచి అనుమతుల ప్రక్రియ ఆలస్యం కావచ్చు. కొన్నేళ్ల క్రితం చైనా వీబోలో చేరిన మోదీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు ప్రధాని 115 పోస్టులను అందులో ఉంచారు. అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున అందులో ఉన్న పోస్టులను తొలగించే కార్యక్రమం జరుగుతోంది. అయినప్పటికీ మోదీ ఫాలోవర్ల సంఖ్య తగ్గలేదని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. 

కరోనా పోరులో వైద్యుల పాత్ర భేష్‌: మోదీ 
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో వైద్యులు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. డాక్టర్స్‌ డే సందర్భంగా ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. వైద్యులు తమ ప్రాణా లను పణంగా పెడుతూ కరోనాపై స్ఫూర్తిదాయక పోరాటం సాగిస్తున్నారని కొనియాడారు. విశేషమైన సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి దేశం మొత్తం ప్ర ణామం చేస్తోందన్నారు. జూలై 1 డాక్టర్స్‌ డేతోపాటు ‘చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌(సీఏ) డే’ కూడా కావడంతో ప్రధాని సీఏల సేవలను గుర్తుచేశారు. 

వెంకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆరోగ్యవంతుడిగా నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య  పెద్దల సభను సమర్థంగా ముందు నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు