వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ

24 Dec, 2019 19:42 IST|Sakshi
అటల్ బిహారీ వాజ్‌పేయి

లక్నో: దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. డిసెంబర్ 25న లక్నోలో జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్‌ గవర్నర్ ఆనందీ బెన్పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ, ఆరెస్సెస్‌ కార్యకర్త రాకేశ్ సిన్హా హాజరుకానున్నారు. యూపీ అసెంబ్లీ స్పీకర్ హృదయ నారాయణ్ దీక్షిత్ అధ్యక్షత వహించనున్నారు.

ఈ మేరకు... 'డిసెంబర్ 25 మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానం ద్వారా లక్నో చేరుకున్న అనంతరం వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు' అని సాంస్కృతిక శాఖ సంయుక్త డైరెక్టర్ వైపీ సింగ్ పేర్కొన్నారు. అనంతరం 25 నిమిషాలపాటు ప్రధాని ప్రసంగం ఉంటుందని... ఆ వెంటనే  సాయంత్రం 4 గంటలకు మోదీ ఢిల్లీకి బయలుదేరుతారని తెలిపారు. ఇక వేడుకల్లో జాతీయ కవి సమ్మేళనం నిర్వహించనున్నారు. కాగా 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినమైన డిసెంబర్ 25న 'జాతీయ సుపరిపాలన దినోత్సవం'గా జరుపుకొంటున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు