పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మోదీ

24 Feb, 2019 17:45 IST|Sakshi

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం పీఎం-కిసాన్‌ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడనుంచి అర్ధకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. అలహాబాద్‌ (ప్రయాగ్‌రాజ్‌)లో జరుగుతున్న కుంభమేళాలో ఆయన ఆదివారం త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానమాచరించారు. అనంతరం మోదీ సంగం ఘాట్‌ వద్ద పూజలు నిర్వహించారు. ఆ తర్వాత అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. వాళ్లే నిజమైన కర్మ యోగులంటూ వారి సేవలను మోదీ కొనియాడారు. గంగా హారతి ఇచ్చి పారిశుద్ధ్య కార్మికుల కాళ్లను కూడా మోదీ కడిగారు. వారికి అంగవస్త్రాలను బహూకరించారు. వారి సేవల వల్లే కుంభమేళా ప్రదేశం శుభ్రంగా ఉందన్నారు. 130 కోట్ల మంది భారతీయులు బాగుండాలని త్రివేణి సంగమం వద్ద తాను కోరుకున్నట్లు మోదీ ట్విట్టర్‌లో చెప్పారు. కుంభమేళాను విజయవంతం చేసేందుకు అవసరమైనదంతా తాము చేశామని మోదీ చెప్పారు.

మరిన్ని వార్తలు