జిన్‌పింగ్‌తో భేటీ : సంప్రదాయ వస్త్రధారణలో మోదీ

11 Oct, 2019 18:01 IST|Sakshi

చెన్నై : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. మోదీ క్రీమ్‌ కలర్‌ పంచెపై తెల్లటి షర్ట్‌ను ధరించారు. జిన్‌పింగ్‌ విడిది చేసిన మహాబలిపురంలో చైనా అధ్యక్షుడితో కలిసి మోదీ చారిత్రక కట్టడాలను సందర్శించారు. శోర్‌ ఆలయ ప్రాంగణాన్ని ఇరువురు నేతలు చుట్టివచ్చారు. వెయ్యేళ్ల ఆలయ చరిత్రను, చారిత్రక కట్టడాలను ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. మోదీ జిన్‌పింగ్‌లు ఆలయ ప్రాంగణంలో భేటీ అయ్యారు. కొబ్బరి నీరు సేవిస్తూ వారు కొద్దిసేపు సేదతీరారు. అంతకుముందు మహాబలిపురంలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచరథాలు కొలువుతీరిన ప్రదేశాలను వారు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఇక మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య శనివారం ఫిషర్‌మెన్‌ కోవ్‌ రిసార్ట్స్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. చర్చల అనంతరం ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ గౌరవార్ధం లంచ్‌ ఏర్పాటు చేస్తారు.

విందులో దక్షిణాది రుచులు..
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే విందులో దక్షిణాదిలో పేరొందిన ప్రముఖ తమిళ వంటకాలు ఏర్పాటు చేస్తున్నారు. రసం, సాంబార్‌, కడై కుర్మా, కవనరసి హల్వాతో పాటు చెట్టినాడ్‌ నుంచి కరైకుడి వరకూ అన్ని ప్రాంతాల రుచులనూ మెనూలో చేర్చారు.

మరిన్ని వార్తలు