ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన మోదీ.. విశేషాలు

27 May, 2018 11:35 IST|Sakshi
రోడ్‌షోలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ : కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఢిల్లీ-మీరట్‌ ఎక్స్‌ప్రెస్‌వే తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ఆదివారం ఈ రహదారిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఓపెన్‌ టాప్‌ కారులో ఆరు కిలోమీటర్ల దూరం రోడ్‌షో నిర్వహించారు. నిజాముద్దీన్‌ బ్రిడ్జ్‌ నుంచి ఢిల్లీ యూపీ బార్డర్‌ వరకు నిర్మించతలపెట్టిన ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో తొలి దశగా 8.360 కిలోమీటర్లను అత్యంత తక్కువకాలంలో నిర్మించి రికార్డు నెలకొల్పారు. మొదట 30 నెలలుగా ప్రాజెక్టు కాలం అంచనా వేసినా, కేవలం18 నెలల్లోనే ఈ 14 లైన్ల ఎక్స్‌ప్రెస్‌వేను పూర్తి చేయడం విశేషం. 

ఎక్స్‌ప్రెస్‌వే విశేషాలు..

  • తొలి దశ రోడ్డు నిర్మాణానికి రూ. 841.50 కోట్ల ఖర్చు
  • మొత్తం 14 లైన్లు, అందులో 6 ఎక్స్‌ప్రెస్‌, 4+4 సర్వీస్‌ లైన్లు
  • రహదారికి ఇరువైపుల 2.5 మీటర్ల సైకిల్‌ ట్రాక్‌ను కూడా నిర్మించారు. దాంతో పర్యావరణ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు.
  • సోలార్‌ సిస్టమ్స్‌తో లైట్లు, డ్రిప్‌ సిస్టమ్స్‌ ద్వారా చెట్లకు నీళ్లు.
  • ఈ ప్రాజెక్టుకు 2015 డిసెంబర్‌ 31న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 
  • అత్యంత వేగంగా, సురక్షితంగా ఢిల్లీ- మీరట్‌ల మధ్య ప్రయాణించేందుకు ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు.
  • ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం పొడవు 82 కిలోమీటర్లు, మొత్తం నాలుగు దశల్లో దీన్ని పూర్తిచేయనున్నారు.
    27.74 కిలోమీటర్లు 14 లైన్లు కాగా, మిగతా దూరం 6 లైన్లు. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 4975.17 కోట్లు.
  • దేశంలో సైకిల్‌ ట్రాక్‌ గల మొట్టమొదటి రహదారి ఇదే కావడం విశేషం. 
  • మొత్తం 28 కిలోమీటర్ల మేర ఢిల్లీ నుంచి దాసన్‌ వరకు సైకిల్‌ ట్రాక్‌.. 
  • ఈ ప్రాజెక్టులో భాగంగా 11 ఫ్లై ఓవర్లు, 5 మేజర్‌, 24 మైనర్‌ బ్రిడ్జ్‌లు, 3 రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌లు, 36 వాహన, 14 కాలినడక అండర్‌వే పాసులు నిర్మించారు. 
  • ప్రాజెక్టు మొత్తం పూర్తయితే కేవలం ఒక గంటలోనే ఢిల్లీ నుంచి మీరట్‌కు చేరుకోవచ్చు.
మరిన్ని వార్తలు