పట్న: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు. హజీపూర్ నిర్మించిన దిగా-సొనేపూర్ మధ్య కొత్తగా నిర్మించిన రైల్ కం రోడ్డు బ్రిడ్జిని ప్రధాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.
ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు సీఎం నితీష్ ప్రధానికి ఆహ్వానం పలుకుతూ మాట్లాడారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు వింత అనుభవం ఎదురైంది. ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక పక్క నితీష్ ప్రసంగిస్తుండగానే 'మోదీ' , ' మోదీ జిందాబాద్ 'అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో మోదీ లేచి నిలబడి .. నిశ్శబ్దంగా ఉండాలంటూ సభికులనుద్దేశించి కోరడం అక్కడున్న వారందరినీ ఆశ్యర్యంలో ముంచెత్తింది.
అనంతర ప్రసంగించిన మోదీ నితీష్ జీ రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టు ఇన్నాళ్లకీ పూర్తయిందంటూ చెణకులు విసిరారు. బిహార్ అభివృద్ధి భారతదేశం యొక్క పురోగతిగా కేంద్రం భావిస్తోందన్నారు. ఈ అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భుజం భుజం కలిపి పనిచేయాలని ఆకాంక్షించారు. ఇక్కడి ప్రజల ఉత్సాహాన్ని చూస్తోంటే రైల్వేల ప్రాధాన్యత తనకు అర్థమైందన్నారు.రైల్వేల పూర్తి ఆధునీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
కాగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మోదీ, నితీష్ తొలిసారి పట్నా వెళ్లారు. ఈ రోజు ఉదయం పట్నా హైకోర్టు శతదినోత్సవ ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. అక్కడ కూడా పీఎం, సీంఎం వేదికపై పక్కపక్కనే కూర్చుని,నవ్వులు రువ్వుకోవడం విశేషం.