‘పెట్టుబడులతో రండి’

15 Jul, 2020 19:39 IST|Sakshi

భారత్‌-ఈయూ సదస్సులో మోదీ

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని యూరప్‌ ఇన్వెస్టర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు. భారత్‌లో పునరుత్పాదక ఇంధన వాడకాన్ని ప్రోత‍్సహిస్తున్నామని, యూరప్‌ నుంచి ఈ రంగంలో పెట్టుబడులు, సాంకేతిక సహకారాన్ని స్వాగతిస్తామని చెప్పారు. ఐరోపా యూనియన్‌ (ఈయూ)తో సంబంధాలను భారత్‌ మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉందని, ఇందుకు కార్యాచరణ ప్రణాళికతో కూడిన అజెండాతో ముందుకెళతామని అన్నారు.15వ ఈయూ-ఇండియా సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రారంభోపన్యాసం​చేశారు. ఐరోపా యూనియన్‌తో సంబంధాల బలోపేతానికి భారత్‌ కట్టుబడి ఉందని అన్నారు.

ఈయూతో పటిష్ట సంబంధాలకు కార్యాచరణ ప్రణాళికను నిర్ధిష్ట కాలపరిమితిలో అమలు చేయాలని చెప్పారు. కోవిడ్‌-19 కారణంగా ఈ సదస్సును వాయిదా వేయాల్సి వచ్చిందని, ఇప్పుడు వర్చువల్‌ భేటీతో ముందుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. కరోనా వైరస్‌తో యూరప్‌కు వాటిల్లిన పెను విషాదానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని చెప్పారు. కోవిడ్‌-19తో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగంలో నూతన సమస్యలు ఉత్పన్నమయ్యాయని చెప్పారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజాస్వామిక దేశాల మధ్య విస్తృత సహకారం అవసరమని అన్నారు. కోవిడ్‌-19 కారణంగా మన పౌరుల ఆరోగ్యం, ఆర్థిక స్ధితిగతులు ఇబ్బందుల్లో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక పునర్మిర్మాణంలో భారత్‌-ఈయూ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత సవాళ్లతో పాటు వాతావరణ మార్పుల వంటి దీర్ఘకాలిక సవాళ్లనూ దీటుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత్‌- ఈయూల మధ్య భాగస్వామ్యంతో ప్రపంచ శాంతి, సుస్ధిరతలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

చదవండి : భారత్‌కు గూగుల్‌ దన్ను!

>
మరిన్ని వార్తలు