వికాస్‌ దూబే మరో సహచరుడు అరెస్టు!

14 Jul, 2020 12:15 IST|Sakshi

లక్నో : గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే మరో అనుచరుడిని ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కన్పూర్‌లో పోలీసులపై దాడికి తెగబడ్డ కేసులో ప్రధాన నిందితుడు వికాస్‌ దూబే సహాయకుడు శశికాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శశికాంత్‌తో సహా ఇప్పటి వరకు నలుగురిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయంపై పోలీస్‌ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ. ఈ కేసులో మొత్తం 21 మంది నిందితులు భాగస్వాయ్యం అయినట్లు వెల్లడించారు. వీరిలో నలుగురిని అరెస్టు చేయగా వికాస్‌ దూబేతో సహా ఆరుగురు నిందితులను వివిధ ఘటనల్లో పోలీసుల విచారణలో మరణించినట్లు పేర్కొన్నారు. మిగతా 11 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. (గ్యాంగ్‌స్ట‌ర్‌ వికాస్ దూబే అరెస్ట్‌)

అలాగే కాన్పూర్ ఆకస్మిక దాడిలో యూపీ పోలీసుల నుంచి నేరస్తులు ఎత్తుకెళ్లిన రెండు రైఫిల్స్‌ను కూడా శశికాంత్ అరెస్ట్ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులపై దాడి ఘటన అనంతరం పోలీసుల నుంచి నేరస్తుల ముఠా దోచుకున్న అన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈనెల 3న వికాస్‌దూబే అనుచరులు కాల్పులు జరిపిన ఘటనలో డీఎస్పీ సహా మొత్తం 8 మంది పోలీసులు నేలకొరిగిన విషయం విదితమే. పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎనిమిది మంది మరణానికి కారణమైన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే గత శుక్రవారం పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.  (రౌడీషీటర్ల కాల్పులు.. 8 మంది పోలీసుల మృతి)

చదవండి : గ్యాంగ్‌స్టర్ దుబే హతం

మరిన్ని వార్తలు