బీజేపీ ఎమ్మెల్యే మృతి: సూసైడ్‌ నోట్‌ లభ్యం

13 Jul, 2020 15:02 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ బీజేపీ ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ రే అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే మృతదేహం చొక్కా జేబులో సూసైడ్‌ నోట్‌ లభించినటట్లు పోలీసులు తెలిపారు. తన మృతికి ఇద్దరు వ్యక్తులు కారణమని, ఆ ఇద్దరు వ్యక్తులు తన మృతికి బాధ్యత వహించాలని ఎమ్మెల్యే  దేబేంద్ర నాథ్‌ సూసైడ్‌ నోట్లో రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (బీజేపీ ఎమ్మెల్యే అనుమానాస్పద మృతి)

ఉత్తర దినాజ్‌పూర్‌లోని బిందాల్ గ్రామం సమీపంలో ఉన్న మార్కెట్‌లో ఎమ్మెల్యే దేబేంద్ర నాథ్ ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి ఒంటి గంటకు ఎమ్మెల్యేను కొంత మంది వ్యక్తులు పిలిచారని, అతనిది ఆత్మ హత్య కాదని ఎవరో కావాలని హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే మృతి హత్యా? ఆత్మహత్య? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతుతున్నాయి. ఆయన మృతిపై ఇంకా స్పష్టత రాలేదు.  

ఎమ్మెల్యే మృతి కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేత రాహుల్‌ సిన్హా డిమాండ్‌ చేశారు. దేబేంద్ర నాథ్‌ మృతి వెనక తృణమూల్‌ కాంగ్రెస్‌ హస్తం ఉందని తీవ్రంగా ఆరోపించారు. మృతికి సంబంధించిన నిజాలు బయటకు రావడానికి సీబీఐ దర్యాప్తుకు అనుమతించాని సీఎం మమతా బెనర్జీని కోరుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు