పెద్ద మనసు చాటుకున్న యూపీ పోలీసులు

19 Jan, 2019 09:52 IST|Sakshi
భార్యతో సుబోధ్‌ కుమార్‌ (పాత చిత్రం)

లక్నో : బులంద్‌షహర్‌ హింసాకాండలో మృతి చెందిన ఎస్‌ఐ సుబోధ్‌ కుమార్‌ కుటుంబానికి యూపీ పోలీసులు అండగా నిలిచారు. తమ వంతు సహాయంగా 70 లక్షల రూపాయలు అందించి పెద్ద మనసు చాటుకున్నారు.  ఈ విషయం గురించి పోలీసు ఉన్నతాధికారి ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘ సుబోధ్‌ కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రకటించిన 50 లక్షల రూపాయల పరిహారంతో పాటుగా.. మా వంతు సహాయంగా మరో 70 లక్షల రూపాయలు వాళ్లకు అందిస్తాం’ అని వ్యాఖ్యానించారు.

కాగా బులంద్‌షహర్‌లోని మహావ్‌ గ్రామంలోని ఓ చెరుకు తోటలో ఆవు కళేబరాన్ని కనుగొనడంతో వివాదం​మొదలైంది. ఏడుగురు ముస్లింలు ఆవును చంపారని ఆరోపిస్తూ డిసెంబర్‌ 3న ఆందోళనకారులు ఛింగ్రావతి పోలీసు అవుట్‌ పోస్ట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎస్సై సుబోధ్‌ కుమార్‌తో పాటు సుమిత్‌ కుమార్‌ అనే యువకుడు కూడా మృతి చెందాడు. స్థానికులను రెచ్చగొట్టి హింసాకాండకు కారణమయ్యాడని భజరంగ్‌ దల్‌ నాయకుడు యోగేష్‌ రాజ్‌ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. (ముమ్మాటికి కుట్రతోనే ‘విధ్వంసం’)

ఇక యూపీలోని దాద్రిలో 52 ఏళ్ల మొహమ్మద్‌ అఖ్లాక్‌ మూక హత్య కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సుబోధ్‌ కుమార్‌ ఈ విధ్వంసకాండ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరణించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే 2015లో జరిగిన అఖ్లాక్‌ హత్య కేసులో స్థానిక బీజేపీ శాసన సభ్యుడితోపాటు పలువురు భజరంగ్‌ దళ్‌ నాయకులు ఈ కేసులో నిందితులుగా ఉండటం.. బులంద్‌షహర్‌ ఘటనలో కూడా భజరంగ్‌ దల్‌ నాయకుడు యోగేష్‌ రాజ్‌పై ఆరోపణలు రావడంతో యోగి సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని వార్తలు