లాక్‌డౌన్‌ : పేదోడిపై పోలీసుల ప్రతాపం

11 May, 2020 10:52 IST|Sakshi

లక్నో : లాక్‌డౌన్‌ కారణంగా పేద ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తిండిదొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. దొరికినవాటితో సరిపెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు చేసిన నిర్వాకం తీవ్ర విమర్శల పాలు చేస్తోంది. విధుల్లో భాగంగా మీరట్‌ వీదుల్లో గాస్తీగాస్తున్న పోలీసులు.. రోడ్డుపక్కన ఉన్న కూరగాయలను నేలపాలు చేశారు. తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకుంటూ  ఓ వ్యక్తి గల్లీలో నిలిచుని ఉన్నాడు. అదే సమయంలో అటువైపుగా వచ్చిన పోలీసులు గుంపు బండిపై ఉన్న కూరగాయలను నేలపై పారబోసి వెల్లిపోయారు. వీరిలో ఓ ఉన్నతాధికారి కూడా ఉండటం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను గుర్తుతెలియని వ్యక్తి సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో పోలీసుల దుశ్చర్య వెలుగులోకి వచ్చింది. వీడియోకాస్తా నెట్టింట వైరల్‌గా మారడంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ ఘటనపై స్పందించింది. వెంటనే విచారణకు ఆదేశిస్తున్నట్లు మీరట్‌ సీనియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌ అఖిలేష్‌ నారాయన్‌ సింగ్‌ తెలిపారు.

ఘటనకు పాల్పడిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలావుండగా ఈ ఆ ఘటనపై స్పందించిన ఓ అధికారి హాట్‌స్పాట్‌ ఏరియాలో ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఆ చర్యకు పాల్పడి ఉండొచ్చని వివరించారు. కాగా మీరట్‌తో పాటు మరో ఐదు జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంది. హాట్‌స్పాట్‌ ప్రకటించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. మొత్తం 72 జిల్లాలో 300 హాట్‌స్పాట్‌ కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గుర్తించింది. వీటిలో ఎలాంటి కార్యాకలాపాలకు అనుమతులను ఇవ్వడం లేదు. (24 గంటల్లో 4,213 పాజిటివ్‌ కేసులు)

మరిన్ని వార్తలు