సియా సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్న పోలీసులు

26 Jun, 2020 11:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టిక్‌టాక్ స్టార్ సియా కక్కర్(16) ఆత్మహత్య అంశంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కోణం లేదని ఢిల్లీ పోలీసులు శుక్రవారం స్పష్టం చేశారు. గురువారం(జూన్‌ 25) సియా కక్కర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సియా కక్కర్‌ ఆత్మహత్యపై ఎలాంటి ఆరోపణలు లేకపోవడంతో పోలీసులు ఆమె సెల్‌ఫోన్‌ ఆధారంగా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో సియా సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అన్‌లాక్‌కు ప్రయత్నిస్తున్నారు. కాగా బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ మరణాన్ని తట్టుకోలేక అతడి అభిమానులు ఆత్మహత్య చేసుకుంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా సియా కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందనే అనుమానంతో దర్యాప్తు చేపట్టగా అలాంటిది ఏమి లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. (టిక్‌టాక్‌ స్టార్‌ ఆత్మహత్య.. అనుమానాలు)

అయితే సియా కూడా నాలుగైదు రోజులుగా ఒత్తిడికి గురైనట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మరోవైపు సియా ఆకస్మిక మరణం ఆమె కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫాం టిక్‌టాక్‌లో లక్షల్లో ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న సియా తన డ్యాన్స్‌, నటనతో అభిమానులను అలరించేది. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సియా ఆత్మహత్య చేసుకుందన్న చేదు వార్త  టిక్‌టాక్‌ అభిమానులను షాక్‌కు గురి చేసింది. సియా ఆత్మహత్యపై ఆమె మేనేజర్‌ అర్జున్‌ సిరిన్‌ స్పందిస్తూ.. ‘నా కంపెనీలో ప్రతిభావంతులైన ప్రముఖులలో సియా ఒకరు. తన చేతిలో మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి విషయమై  తనతో బుధవారం రాత్రి కూడా మాట్లాడాను అప్పుడు బాగానే ఉంది. కానీ తను ఎందుకిలా చేసిందో అర్థం కావడంలేదు’ అని అన్నారు. (తనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాం.. కానీ: సుశాంత్‌ తండ్రి)

మరిన్ని వార్తలు