'రేప్ చేశాడని చెప్పినా కేసు పెట్టడంలేదు'

30 Nov, 2015 09:06 IST|Sakshi

న్యూఢిల్లీ: తనపై అత్యాచారం జరిగిందని కేసు పెట్టేందుకు వెళితే పోలీసు ఉన్నతాధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని గుర్గావ్కు చెందిన ఓ యువతి మీడియాతో వాపోయింది. ఈ నెల 23న ధరమ్ వీర్ థక్రాన్ అనే భూస్వామి అర్థరాత్రి సమయంలో తన ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వచ్చి తుపాకీని తలకు గురిపెట్టి చంపేస్తానని బెదిరించి లైంగికదాడి చేశాడని, ఈ విషయం ఎవరితోనైనా చెబితో ప్రాణాలతో ఉండవని హెచ్చరించి వెళ్లి మరో రెండు రోజుల తర్వాత వచ్చి తిరిగి అదే అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది.

తొలుత స్టేషన్ కు వెళ్లినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని చెప్పిన నవదీప్ సింగ్ విర్క్ అనే పోలీస్ కమిషనర్ కేసు పురోగతి గురించి ప్రశ్నించేందుకు వెళ్లగా అవతలికి పో అంటూ గదమాయించాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను చెప్పేది వినకుండానే నిర్లక్ష్యంగా చూస్తూ ఇక్కడ నీ ఫిర్యాదు తీసుకొనబడదని, నువ్వెంత తిరిగినా నీ పని పూర్తవదని అన్నారని వాపోయింది. తనపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి ఎక్కువ మొత్తంలో ఆస్తులు ఉన్నకారణంగా పోలీసులు అతడి ప్రలోభాలకు తలొగ్గి ఇప్పటి వరకు అతడిని అరెస్టు చేయలేదని వాపోయింది. కాగా, ఆమె ఆరోపణలన్నీ అవాస్తవాలనీ త్వరలోనే నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు