శ్రుతితప్పిన ‘ఇన్‌మైఫీలింగ్స్‌’

31 Jul, 2018 19:01 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ‘కికీ ఛాలెంజ్‌ లేదా ఇన్‌మైఫీలింగ్స్‌ చాలేంజ్‌’ను స్వీకరించి ఎవరు కూడా రోడ్లపై డ్యాన్సులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోకూడదంటూ ఢిల్లీ, ముంబై, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు మంగళవారం నాడు తమ నగరాల పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన ఓ నీగ్రో యువకుడు శనివారం నాడు ఫ్లోరిడాలో కారులో నుంచి దూకి రోడ్డుపై డ్యాన్స్‌ చేయడం ప్రారంభించారు. అంతే అటువైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో గాయపడి ప్రస్తుతం ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇలా పలు దేశాల్లో పలువురు గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ కెనడా గాయకుడు డ్రేక్‌ జూలై పదవ తేదీన తన కొత్త పాటల ఆల్బమ్‌ను విడుదల చేశారు. అందులో ఆయన పాడిన ‘ఇన్‌మై ఫీలింగ్స్‌’ పాట సూపర్‌ హిట్టయింది. ఈ పాటకు డ్యాన్స్‌ చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌ షిగ్గీ షో, సోషల్‌ మీడియాలో ఇతరులను కూడా డ్యాన్స్‌ చేయాల్సిందిగా సవాల్‌ విసిరారు. అది కాస్త వైరల్‌ అవడంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ‘ఇన్‌మైఫీలింగ్స్‌’ పాటకు డ్యాన్స్‌ చేస్తూ వీడియోలు తీసుకొని వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. మొదట పార్కుల్లో, బీచుల్లో, రైల్వే స్టేషన్లలో మొదలైన ఈ డ్యాన్సు ఛాలెంజ్‌ ఆస్పత్రులకు అటు నుంచి రోడ్డపైకి చేరుకుంది.

సియెర్రా, విల్‌స్మిత్, ఓడెల్‌ బెకమ్‌ లాంటి సెలబ్రిటీలు కూడా తమ డ్యాన్స్‌ వీడియోలను పోస్ట్‌ చేయడంతో సోషల్‌ మీడియా యూజర్లను మరింత ఆకర్షించింది. ‘రోడ్లపై మీద డ్యాన్సులు చేసినట్టయితే మరో చోటుకు ద్వారాలు తెరచుకుంటాయి’ అంటూ అంబులెన్స్‌ ఫొటోలతో ఢిల్లీ, ముంబై పోలీసుల ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇంతకుముందు ‘ది ఐస్‌ బకెట్‌ ఛాలేంజ్, ది రన్నింగ్‌ మేన్‌ ఛాలెంజ్‌, ది మేమ్‌క్విన్‌ ఛాలేంజ్‌’లు వైరల్‌ అయినా అవి ప్రాణాల మీదకు తీసుకరాలేదు.

మరిన్ని వార్తలు