జనిగిర్-చంపా : ఓ కానిస్టేబుల్ వినూత్న రీతిలో పై అధికారులను బెదిరించాడు. విధుల నుంచి తొలగిస్తే నక్సలైట్గా మారుతానని ఉన్నతాధికారులను భయపెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన అధికారులతో మాట్లాడిన సంభాషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చత్తీస్గఢ్కు చెందిన పుష్పరాజ్ సింగ్ అనే వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కాగా ఇటీవలి కాలంలో అనుమతి లేకుండానే తరచూ విధులకు గైర్హాజరు అవుతున్నాడు. దీంతో పై అధికారి పుష్పరాజ్ సింగ్ను సస్పెండ్ చేస్తూ నోటీసులు పంపారు. కోపోద్రిక్తుడైన పుష్పరాజ్ అధికారులకు ఫోన్ చేసి.. విధుల్లోకి తీసుకోకపోతే నక్సలైట్గా లేదా ఐఎస్ఐ తీవ్రవాదిగా మారి అందరి అంతు చూస్తానని బెదిరించాడు. ఆ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అయింది. కాగా గత శుక్రవారమే పుష్పరాజ్ను సస్పెండ్ చేశామని జిల్లా ఎస్పీ నీతూ కమల్ పేర్కొన్నారు.