కొడుకుని హత్య చేసిన మండలి ఛైర్మన్‌ భార్య

22 Oct, 2018 15:18 IST|Sakshi

గొంతు నులిమి హత్య చేసిన యూపీ శాసన మండలి ఛైర్మన్‌ భార్య మీరా యాదవ్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపిన ఆ రాష్ట్ర శాసన మండలి ఛైర్మన్ రమేష్‌ యాదవ్‌ కుమారుడి మృతి కేసు ఊహించని మలుపు తిరిగింది. రమేష్‌ కుమారుడు అభిజిత్‌ యాదవ్‌ (23) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అతని మృతిపై పోలీసులకు అనుమానం రావడంతో అతని స్నేహితుల ఫిర్యాదు మేరకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. రిపోర్టులో ఊహించని నిజాలు వెలుగుచూశాయి. అభిజిత్‌ను అతని తల్లి మీరా యాదవ్‌యే గొంతు నులుమి హత్య చేసిందని పోలీసుల విచారణలో తెలింది. దీంతో పోలీసులతో సహా కుటుంబ సభ్యులు కూడా ఒక్కసారిగా షాక్‌కి గురైయ్యారు.

అసలు విషయం బయట పడడంతో.. మీరా కూడా నిజం ఒప్పుకోవడంతో పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. శనివారం రాత్రి అభిజిత్‌ బాగా మధ్యం సేవించి ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య  స్పల్ప వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే మీరా అతనిని గొంతు నులుమి హత్య చేశారని పోలీసులు తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్‌ శాసన మండలి ప్రస్తుత ఛైర్మన్‌ రమేష్‌కు మీరా రెండో భార్య కావడం గమనార్హం. 

>
మరిన్ని వార్తలు