కలవరం

10 Jul, 2014 23:38 IST|Sakshi

 సాక్షి, ముంబై : సుఖ ప్రసవంతోపాటు బాలింతలు సురక్షితంగా ఉండాలని ప్రభుత్వంతోపాటు ఇతర రంగాలు ‘జననీ సురక్ష యోజన’ లాంటి  వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. అయినప్పటికీ బాలింతల మృతుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఇది ముంబైలాంటి మెట్రోపాలిటన్ నగరంలో అత్యధికంగా చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

 రెండు నెలల్లో మృతుల సంఖ్య పెంపు
 ఈ ఏడాది ఏప్రిల్, మే లో 61 మంది బాలింతలు మృతి చెందగా అదే 2013లో ఏప్రిల్, మేలో 31 మృతి చెందారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది కేవలం రెండు నెలల్లో మృతుల సంఖ్య రెట్టింపు అయ్యిందని మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలను బట్టి స్పష్టమైంది.

 ఇందులో 26 మంది బాలింతలు ముంబైలో మృతి చెందగా మిగతా 35 మంది మహిళలు శివారు ప్రాంతాలకు చెందినవారున్నారు. గత ఐదేళ్ల కాలంలో ముంబైలోనే అత్యధికంగా బాలింతలు మృతి చెందారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 206 మంది బాలింతలు చనిపోయారు. ఇందులో ఒక్క ముంబైలోనే 125 మంది చనిపోగా, మిగతా 81 మంది శివారు ప్రాంతాలకు చెందినవారున్నారు.

 బీఎంసీ ఆస్పత్రుల్లోనే..
 ముంబైలో మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కి చెందిన ప్రధాన ఆస్పత్రులు మూడు ఉన్నాయి. నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ముందుగా బీఎంసీ ఆస్పత్రులకే  పంపిస్తారు. అందుచేత ముంబైలోనే బాలింతల మృతుల సంఖ్య ఎక్కవగా నమోదైతుందని ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నారు. గతంలో మృతుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రభుత్వం చేపట్టిన జనజాగృతి కార్యక్రమాలు, ప్రవేశ పెట్టిన పథకాలు సఫలీకృతమైనట్లు వైద్య శాఖ భావించింది. కానీ ఇటీవల కాలంలో మృతుల సంఖ్య మళ్లీ పెరిగిపోవడంతో ఆరోగ్య శాఖను కలవరానికి గురిచేస్తోంది.

మరిన్ని వార్తలు