కుమారస్వామి సర్కార్‌కు షాక్‌..

12 Sep, 2018 16:24 IST|Sakshi
వివాదానికి కారణమైన కాంగ్రెస్‌ నేతలు లక్ష్మీ హెబాల్కర్‌, రమేష్‌ జర్కిహోలి

సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటకలో జేడీ(ఎస్‌)-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ చిక్కుల్లో పడింది. బెలగావి రూరల్‌ ఎమ్మెల్యే లక్ష్మీ హెబాల్కర్‌తో విభేదాలు జర్కిహోలి సోదరుల నిష్ర్కమణకు దారితీసేలా ఉండటంతో కాంగ్రెస్‌తో పాటు సంకీర్ణ సర్కార్‌లోనూ ఆందోళన నెలకొంది. విభేదాల పరిష్కారానికి కేపీసీసీ చీఫ్‌ డీజీ రావు, డిప్యూటీ సీఎం పరమేశ్వర చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో 14 మంది ఎమ్మెల్యేలతో తాము సర్కార్‌ నుంచి వైదొలుగుతామని జర్కిహోలి సోదరులు హెచ్చరించారు.

ఇటలీ పర్యటనలో ఉన్న మాజీ సీఎం సిద్ధరామయ్య తిరిగి రాగానే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని వారు ప్రకటించారు. బెలగావి పీఎల్డీ బ్యాంకు ఎన్నికల వివాదం తాజా చిచ్చుకు కారణమైంది. బెలగావి జిల్లా నుంచి తాము సూచించిన వారికి మంత్రివర్గంలో స్ధానం కల్పించాలని, లక్ష్మీ హెబాల్కర్‌ను రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మరోవైపు జర్కిహోలి సోదరులు బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బీఎస్‌ యడ్యూరప్పతోనూ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. కాగా పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని కేపీసీసీ చీఫ్‌ డీజీ రావు స్పష్టం చేశారు. తమ పార్టీలోకి వచ్చేందుకు ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, కానీ తాము అనైతిక కార్యకలాపాలకు వ్యతిరేకమని చెప్పారు. బీజేపీ తోకజాడిస్తే తాము మౌనంగా కూర్చోలేమని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు