న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ వెనక్కితగ్గబోదు అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. తెలంగాణపై కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోందని కేసీఆర్కు రాజ్నాథ్ చెప్పారు అని జవదేకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ గత జులైలో నిర్ణయం తీసుకుంది. అయితే ఇంతవరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు అని జవదేకర్ అన్నారు.
పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి మరో వారం గడువే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణను అడ్డుకోవడానికి దేశరాజధానిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ధర్నా చేస్తారు. ఆ పార్టీ ఎంపీలే ఇరుసభల్లో గొడవకు దిగుతారు అని జవదేకర్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల నేతలతో రాజకీయాలు చేస్తోంది అని జవదేకర్ విమర్శించారు. కాంగ్రెస్ గేమ్ప్లాన్ పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు. కాంగ్రెస్ ద్వంద విధానాలను వ్యవహార శైలిని కేసీఆర్కు విపులంగా రాజ్నాథ్ వివరించారు అని జవదేకర్ మీడియాకు తెలిపారు.