ఉప ఎన్నికలకు పని చేయను: ప్రశాంత్‌ కిషోర్‌

3 Jun, 2020 10:05 IST|Sakshi

భోపాల్‌: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరికి సుపరిచితుడే. పీకేతో ఒప్పందం కుదుర్చుకుంటే ఎన్నికల్లో విజయం సాధిస్తామని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే మధ్యప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాల్సిందిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌ను కోరింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు.  జ్యోతిరాదిత్య సింథియా తన వర్గం ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 

ఈ సందర్భంగా ప్రశాంత్‌ కిషోర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు ప్రచార బాధ్యతలను అప్పగించాలని కమల్ నాథ్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా భావించారు. వారు నన్ను సంప్రదించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సహకరించాలని కోరారు. కాని నేను దానికి అంగీకరించలేదు. ముక్కలు ముక్కలుగా జరిగే ఎన్నికల్లో నేను కాంగ్రెస్ కోసం పనిచేయలేనని స్పష్టంగా చెప్పాను’ అన్నారు. 

2014 ఎన్నికల్లో తొలిసారి ప్రశాంత్‌ కిషోర్‌ నరేంద్ర మోదీ కోసం పని చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అయితే  తరువాత అమిత్ షాతో వచ్చిన విభేదాల కారణంగా ఆయన బీజేపీకి దూరమయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రశాంత్‌ కిషోర్‌.. అరవింద్ కేజ్రీవాల్ కోసం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ప్రశాంత్‌ కిషోర్‌ వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ కోసం.. తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్ కోసం పని చేస్తున్నారు.(ప్రశాంత్‌ కిషోర్‌కు అత్యవసర పిలుపు..)

మరిన్ని వార్తలు