రెడ్‌జోన్‌: గ‌ర్భిణీ ఆసుప‌త్రికి వెళ్లేందుకు అనుమ‌తించ‌ని పోలీసులు!

22 Apr, 2020 14:44 IST|Sakshi

రాంచీ : క‌రోనా తీవ్ర‌త ఆధారంగా ప్రాంతాల‌ను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్లుగా విభ‌జించిన విష‌యం తెలిసిందే. రెడ్ జోన్లుగా గుర్తించిన ప్రాంతాల్లో నిత్యావ‌స‌ర స‌రుకులను సైతం ఇంటి ద‌గ్గ‌ర‌కే స‌ర‌ఫ‌రా చేస్తుండ‌గా రాక‌పోక‌లు సైతం పూర్తిగా నిషేధించారు. ఈ క్ర‌మంలో రెడ్‌జోన్‌లో పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్భిణీని ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌డానికి పోలీసులు నిరాక‌రించారు. దీంతో ఇంట్లోనే ప్ర‌స‌వించిన మ‌హిళ శిశువును కోల్పోయిన‌ ఘ‌ట‌న జార్ఖండ్‌లోని హింద్పిరిలో చోటు చేసుకుంది. వివరాలు.. రాంచీలోని హింద్పిరి అత్య‌ధిక క‌రోనా కేసుల‌తో రెడ్‌జోన్ ప‌రిధిలోకి వ‌చ్చింది. ఈ ప్రాంతానికి చెందిన‌ గ‌ర్భిణీ మ‌హిళ‌కు ఆదివారం రాత్రి 11 గంట‌ల‌కు నొప్పులు మొద‌ల‌య్యాయి. దీంతో ఆమె భ‌ర్త ఇంతియాజ్, మిత్రుడి స‌హాయంతో ఆమెను తీసుకుని ఆసుప‌త్రికి బ‌య‌లు దేర‌గా పోలీసులు వారి కారును ఆపారు. (చెవిటి వాడి ముందు శంఖం ఊదడం ఇదే!)

అయితే ప‌రిస్థితిని వివ‌రించి, వెళ్ల‌డానికి అనుమ‌తివ్వాల్సిందిగా వేడుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేక‌పోయింది. దీంతో చేసేదేం లేక ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. ఇరుగు పొరుగు వారి స‌హాయంతో ఆమెకు ప్ర‌స‌వం చేయ‌గా పండంటి బాబుకు జ‌న్మ‌నిచ్చింది. కానీ స‌కాలంలో వైద్యం అంద‌క‌పోవ‌డంతో ఈ లోకంలోకి అడుగుపెట్టిన‌ కాసేప‌టికే శిశువు క‌న్నుమూశాడు. అయితే ఈ ఆరోప‌ణ‌లను అక్క‌డి పోలీసులు ఖండిస్తున్నారు. వేరే మార్గం గుండా ఆసుప‌త్రికి వెళ్తామ‌ని చెప్పి అందుకు బ‌దులుగా తిరిగి ఇంటికి వెళ్లిపోయాడ‌ని వారు పేర్కొంటున్నారు. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై పోలీసు ఉన్న‌తాధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. (‘నాకు నో లాక్‌డౌన్‌’.. ఎమ్మెల్యే రాజాపై విసుర్లు)

మరిన్ని వార్తలు