తిరువనంతపురం : భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సౌమ్యుడు అని మరోసారి అనిపించుకున్నారు. వర్షంలో తడుస్తూనే గౌరవం వందనం స్వీకరించారు. ఆత్రంగా ఆయనకు గొడుకు పట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా అవసరం లేదని చెప్పి నిర్మలంగా వర్షంలోనే నిల్చొని ఆయన వందనం స్వీకరించారు. అదే విధంగా ఆయనకు సెల్యూట్ చేసిన గార్డుకు ప్రతి నమస్కారం చేశారు. ఈ సంఘటన తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది.
రాష్ట్రపతి హోదాలో తొలిసారి కేరళకు వచ్చిన రామ్నాథ్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఉదయం 9.30గంటల ప్రాంతంలో దిగారు. ఆ సమయంలో జోరుగా వర్షం పడుతోంది. గవర్నర్ పీ సదాశివం, ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. 'రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వర్షం పడుతుండటంతో ఆయనకు గొడుకుపట్టేందుకు అధికారులు ప్రయత్నించినా వద్దని చెప్పి వర్షంలోనే గౌరవవందనం స్వీకరించారు' అని అధికారులు తెలిపారు.