ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ సవాల్
కాశీవాసిని ఆశీర్వదించండంటూ విజ్ఞప్తి
వారణాసి/బక్సర్/ససరాం(బిహార్)/చండీగఢ్: ఆస్తులు కూడ బెట్టుకున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ప్రధాని మోదీ గట్టిగా స్పందించారు. విదేశీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నట్లుగానీ, భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లుగానీ నిరూపించాలని సవాల్ విసిరారు. మంగళవారం ఆయన చండీగఢ్, యూపీలోని బలియా, వారణాసి, బిహార్లోని బక్సార్, ససరాంలలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మాట్లాడారు. ‘బినామీ ఆస్తులు, భవనాలు, ఫాంహౌస్లు, షాపింగ్ కాంప్లెక్సులు, విదేశీ బ్యాంకుల్లో డబ్బు, విదేశాల్లో ఆస్తులు, ఖరీదైన వాహనాలు వంటివి నేను పోగేసుకున్నట్లు ఆధారాలుంటే నిరూపించండి’ అని పేర్కొన్నారు. ‘పేదరికం, వెనుకబాటుతనం చవిచూశా. మీరు పడుతున్న బాధనూ నేనూ అనుభవించా. నేను పనిచేస్తున్నది నా పేదరికం, వెనుకబాటుతనం పోగొట్టుకునేందుకు కాదు. మీ కోసమే జీవిస్తున్నా. మీ కోసమే శ్రమిస్తున్నా’ అని అన్నారు.
కాంగ్రెస్ పాలనతో జనం విసుగెత్తారు
1984 సిక్కు వ్యతిరేక అల్లర్లపై కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా చేసిన ‘జరిగిందేదో జరిగింది’ వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావిస్తూ ప్రధాని..గొప్ప వంశీకుడి (రాహుల్) గురువు (పిట్రోడా) చేసిన ఆ వ్యాఖ్య ఆ పార్టీ వైఖరిని బయటపెట్టిందన్నారు. ‘దేశ ప్రజలు కాంగ్రెస్ నేతల పాలన, వారి వారసత్వ రాజకీయాలు, కుంభకోణాలు, అహంకారంతో విసిగిపోయారు. ‘జరిగింది చాలు’ అని అనుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశారు.
కాశీ ఓటర్లకు ఉద్వేగపూరిత విజ్ఞప్తి
‘వారణాసిని ఒక్కసారి దర్శించుకున్న వారయినా ఈ పవిత్ర నగరంలో ఒకరుగా మారిపోతారు. గత ఐదేళ్లలో విశ్వనాథుడి సన్నిధికి పలుమార్లు వచ్చా., ఈ ప్రాంతంతో నాకు విడదీయరాని బంధం ఏర్పడింది. కాశీవాసిగా మారిన నన్ను మళ్లీ ఆశీర్వదించండి’ అని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారం కోసం మళ్లీ రాలేకపోవచ్చని, ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం కాశీకి వస్తానని చెప్పారు. విశ్వనాథుడు కొలువైన ప్రాంతానికి సేవ చేసే అదృష్టం దక్కినందుకు గొప్ప సంతృప్తి కలిగిందంటూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తన హయాంలో వారణాసితోపాటు చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టులను అందులో వివరించారు. అయితే, ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు.