జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

9 Nov, 2019 17:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య తీర్పు న్యాయవ్యవస్థలో చారిత్రాత్మకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ.. శనివారం సాయంత్రం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. నూతన భారత్‌ నిర్మాణానికి సుప్రీంకోర్టు తీర్పు నాంది అని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా వస్తున్న వివాదానికి నేటి తీర్పుతో శాశ్వతంగా ముగింపు పలికిందని మోదీ అభిప్రాయపడ్డారు. కోర్టు తీర్పును దేశమంతా స్వాగతిస్తోందని, ప్రపంచానికి మనదేశ గొప్పతనం తెలిసిపోయిందని అన్నారు. ‘నవంబర్‌ 9 ఎంతో చారిత్రాత్మకమైన రోజు. అయోధ్యపై సుప్రీంకోర్టు మహోన్నతమైన తీర్పును వెలువరించింది. తీర్పును ఎవరూ గెలుపోటములుగా చూడవద్దు. తీర్పును స్వాగతించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రజలు చాలా సంయమనం పాటించారు. భారత న్యాయవ్యవస్థపై అంతర్జాతీయంగా ప్రశంసలు అందుతున్నాయి. భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. భిన్నత్వంలో ఏకత్వానికి నేటి పరిస్థితే నిదర్శనం’ అని అన్నారు.

>
మరిన్ని వార్తలు