వారి పర్యటనల కోసం రూ.4469.5 కోట్లు

12 Mar, 2018 21:34 IST|Sakshi

ఢిల్లీ : భారత ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల విదేశీ పర్యటనల కోసం భారత ప్రభుత్వం మూడు బోయింగ్‌ 777 విమానాలను కొనుగోలు చేసింది. ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా నుంచి ఈ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ భారీ విమానాల్లో పలు ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. పర్యటనల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించాడానికి విలేకరుల సమావేశ గది, వీఐపీ ఎన్‌క్లోజర్‌, అత్యవసర పరిస్థితుల్లో వైద్యసాయం అందించే విధంగా వీటిని రూపుదిద్దనున్నారు. 

క్షిపణి దాడులను తట్టుకునే విధంగా వాటిని ప్రత్యేకంగా రూపొందించేందుకు అమెరికా ప్రభుత్వంతో  భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ఈ మూడు విమానాలును ఎయిర్ ఇండియా నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ .4,469.50 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. ఈ విమానాల కోసం ఎయిర్‌ ఇండియా ప్రత్యేకంగా 44 మంది పైలెట్లను నియమించుకోనుంది. వీరిలో నలుగురు కచ్చితంగా ఢిల్లీలో అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. వీరితో పాటు క్యాబిన్‌ సిబ్బంది, ఇంజనీర్లు, అత్యవసర సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు. ఈ బోయింగ్‌ విమానాల్లో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి కావడానికి 18 నెలల సమయం పట్టనుంది. 2020 నాటికి ఇవి అందబాటులోకి వస్తాయి. 2019లో బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో వీటిలోనే కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు