‘కౌరవ’ వ్యాఖ్యలతో సంబంధం లేదు

7 Jan, 2019 08:56 IST|Sakshi
కె విజయ్‌ రాఘవన్‌

న్యూఢిల్లీ: కౌరవులందరూ టెస్ట్‌ట్యూబ్‌ బేబీలని ఆంధ్రా విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ జి.నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు శాస్త్రీయంగా ఆమోదయోగ్యం కావని కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కె విజయ్‌ రాఘవన్‌ తెలిపారు. పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన 106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో అంశాలను, వక్తలను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌(ఐఎస్‌సీఏ) వక్తల ప్రసంగాలను వడపోత చేయలేదన్నారు. ఓసారి వక్తను ఎంపిక చేసుకున్నాక, వాళ్లు మాట్లాడే అంశంపై ఎలాంటి తనిఖీలు, వడపోతలు జరగవని తేల్చిచెప్పారు.

‘శాస్త్రవేత్తలు ఏదైనా పిచ్చిమాటలు మాట్లాడినప్పుడు ఆ వర్గం నుంచి నిరసనలు ఎదుర్కొంటారు. ఓ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి వీసీగా ఉండీ నాగేశ్వరరావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం’ అని రాఘవన్‌ వ్యాఖ్యానించారు. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో పాల్గొన్న నాగేశ్వరరావు కౌరవులు టెస్ట్‌ ట్యూబ్‌ బేబీలనీ, డార్విన్‌ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం కంటే దశావతారం మరింత అర్థవంతంగా ఉందనీ, రావణుడికి 24 విమానాలు, విమానాశ్రయాలు ఉన్నాయని సెలవిచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రస్తుతమున్న గైడెడ్‌ మిస్సైల్‌ టెక్నాలజీని శ్రీరాముడు, విష్ణువు వాడారన్నారు.  

మరిన్ని వార్తలు