సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ పరీక్షలకు (ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్) 4,500 రూపాయలకు మించి ఫీజు వసూలు చేయరాదని, హాండ్ శానిటైజర్లకు, సర్జికల్ మాస్క్లకు కలిపి 400 రూపాయలకు మించి తీసుకోరాదని భారతీయ వైద్య పరిశోధనా మండలికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాలు తెల్సినవే. కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్చుకుంటే ఎంత ఫీజు ? వారు వేసుకునే ఎన్–95 మాస్క్లకు, గాగుల్స్కు ఎంత ఫీజు? మొత్తం డిశ్చార్జి అయ్యే వరకు ఎంత ఫీజు మించకూడదో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచిగానీ, కోర్టుల నుంచి గానీ దేశంలోని ప్రైవేటు ఆస్పత్రులకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు.
(‘6 రోజులుగా అక్కడ ఒక్కరు మరణించలేదు’)
దాంతో ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు గుంజుతున్నారు. లక్షల్లో చార్జీలు వసూలు చేస్తున్నారని ‘జన్ స్వస్థ్య అభియాన్’కు చెందిన ఆరోగ్య కార్యకర్త ఇనియత్ సింగ్ కాకర్ ఆరోపించారు. ఏ జబ్బుతో రోగులు ఆస్పత్రలకు వెళ్లినా కరోనా పరీక్షలు తప్పనిసరంటూ, కరోనా లేదని నిర్ధారణ అయినా ముందు జాగ్రత్త అంటూ మాస్క్లను ఇస్తూ వాటికి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో కిడ్నీ జబ్బులతో బాధ పడుతున్నవారికి ఒకసారి డయాలసిస్కు 25 వేల రూపాయల చొప్పున వసూలు చేసిన ఆస్పత్రులు ఇప్పుడు 35 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..)