అంతరిక్షంలోకి ‘ప్రైవేటు’ మంచిదే: శివన్

25 Jun, 2020 12:37 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలను అనుమతిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) చైర్మన్ కె.శివన్ గురువారం స్వాగతించారు. ‘ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలను యువత వినియోగించుకుంటుందని భావిస్తున్నా. ఇప్పటికే కొన్ని స్టార్టప్ కంపెనీలు మమ్మల్ని సంప్రదించాయి. గ్లోబల్ స్పేస్ ఎకానమీకి ఇండియా హబ్ గా మారుతుందని బలంగా నమ్ముతున్నా. అంతరిక్ష సంబంధిత విషయాలు పాలుపంచుకునేందుకు ప్రైవేటు కంపెనీలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నారు. (గూగుల్‌ పే సేవలపై ఆర్‌బీఐ స్పష్టత)

అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతిస్తూ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ అథరైజేషన్ సెంటర్(ఐఎన్–ఎస్ పీఏసీఈ)ను ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చింది. ఇది ప్రైవేటు కంపెనీలకు, భారత ప్రభుత్వ అంతరిక్ష సంబంధిత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను వాడుకునేందుకు అనుమతులు జారీ చేస్తుంది. (పాప్‌కార్న్‌ కొనాలంటే చుక్కలే!)

ఐఎస్ఎస్​పీఏసీఈను పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుందని శివన్ వెల్లడించారు. ఇస్రో అన్ని రకాలుగా కొత్త సంస్థకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని చెప్పారు. కొత్త సంస్కరణలు భారత అంతరిక్షంలో ఇస్రో పాత్రను తగ్గించవని పేర్కొన్నారు. ‘ఇస్రో ప్రయోగాలు నడుస్తూనే ఉంటాయి. ఆర్ అండ్ డీ, వేరే గ్రహాలపైకి ప్రయోగాలు, మానవ సహిత అంతరిక్ష యాత్రలు తదితరాలు ఎప్పటిలానే ఉంటాయి’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు