ప్రియాంక చొరవతో దిగివచ్చిన సచిన్‌ పైలట్‌

13 Jul, 2020 14:37 IST|Sakshi

హైమాండ్‌ ముందు కీలక డిమాండ్లు

జైపూర్‌/ఢిల్లీ : రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ మెత్తబడ్డారు. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, గహ్లోత్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న పైలట్‌ అధిష్టానం చొరవతో మనసు మార్చుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగి గహ్లోత్‌, పైలట్‌ మధ్య రాజీ ఫార్ములాను ముందుకు తెచ్చారు. దీంతో పైలట్‌ పలు డిమాండ్లను పార్టీ ముందుంచారు. పార్టీ చీఫ్‌గా తనను కొనసాగించడంతో పాటు తన వర్గానికి నాలుగు మంత్రి పదవులతో పాటు కీలక ఆర్థిక, హోంశాఖలను కట్టబెట్టాలని కోరారు. దీనిపై పార్టీ నేతలు ఇరు వర్గాల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

అంతకుముందు ఢిల్లీ, జైపూర్‌ వేదికగా పార్టీలో రాజకీయ హైడ్రామా చోటుచేసుకుంది. తన ప్రభుత్వం మైనారిటీలో పడలేదని, తనకు 102 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం గహ్లోత్‌ స్పష్టం చేయడంతో నెంబర్‌ గేమ్‌పై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రణదీప్‌ సుర్జేవాలా మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తి కాలం పాలన సాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక 200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో సీఎల్పీ భేటీపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. చదవండి : బీజేపీలో చేరడం లేదు: సచిన్‌ పైలట్‌

మరిన్ని వార్తలు