శ్రామిక్ రైళ్లలో 80 మంది కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : వలస కూలీల దుస్థితికి రైల్వే మంత్రిత్వ శాఖ నిర్వాకమే కారణమని కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా మండిపడ్డారు. ‘శ్రామిక్ రైళ్లలో 80 మంది మరణించారు..40 శాతం రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి..ప్రయాణీకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు చోటుచేసుకుంటున్నా’యని ప్రియాంక ఆరోపించారు. పరిస్ధితులు ఇలా ఉంటే బలహీనంగా ఉన్నవారు రైళ్లలో ప్రయాణానికి దూరంగా ఉండాలని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొనడం దిగ్ర్భాంతికరమని ఆమె అన్నారు.
కరోనా కట్టడికి ప్రకటించిన దేశవ్యాప్త లాక్డౌన్తో వలస కార్మికుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడంతో కాలినడకన, ప్రైవేటు వాహనాల్లో వేలాది వలస కార్మికులు స్వస్థలాలకు తరలివెళుతూ పలువురు మార్గమధ్యలో తనువు చాలించిన ఘటనలు నివ్వెరపరిచాయి.