యోగి సర్కార్‌పై ప్రియాంక మండిపాటు!

27 Apr, 2020 17:16 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో నకిలీ పీపీఈ కిట్ల పంపిణీ కలకలం రేపుతోంది. యూపీలోని మెడికల్‌ కాలేజీలకు, డాక్టర్లకు పంపిన పీపీఈ కిట్లు నకిలివి అంటూ రాష్ట్ర మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర​ జనరల్‌ ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. తరువాత ఆ విషయం బహిర్గతమైంది. ఈ విషయంపై కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం యోగీ ఆదిత్యనాధ్‌ సర్కార్‌ను నిలదీశారు. నకిలీ పీపీఈ కిట్ల స్కామ్‌ వ్యవహారంలో ఎవరు ఉన్నారో తెలుసుకొని వారిని శిక్షించాలని కోరారు. కరోనా యుద్దంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న యోధులు డాక్టర్లని, వారికి నకిలీ కిట్లను సరఫరా చేస్తూ వైద్యుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని మండిపడ్డారు. వైద్యుల భద్రత విషయంలో రాజీపడకూడదని సూచించారు. (చైనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లు వాడొద్దు : ఐసీఎంఆర్)

యోగి సర్కారు మాత్రం నకిలీ కిట్ల వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారు అనే విషయం తెలుసుకోవడం కంటే ముఖ్యంగా ఈ విషయం ఎవరి వల్ల బయటకు వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు. మొదటి అసలు విషయం ఎలా బయటకి వచ్చి అని తెలుసుకోవడం పక్కన పెట్టి నకిలీ కిట్ల స్కామ్‌ వెనుక ఎవరి హస్తం ఉందో తెలుసుకోవాలని కోరారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడం ద్వారా మంచి జరిగిందని లేకపోతే దీనిని మరుగున పడేసేవారని ప్రియాంక ఆరోపించింది. దీనికి సంబంధించిన విషయాలను ప్రియాంక తన ట్విటర్‌ ఖాతాలో హిందీలో పేర్కొన్నారు. (ల్యాబ్లు పెరిగినా టెస్ట్ సంఖ్య పరిమితం..)

మరిన్ని వార్తలు