సోనియా కాదు...ప్రియాంకా రాస్తుందట!

2 Aug, 2014 12:27 IST|Sakshi
సోనియా కాదు...ప్రియాంకా రాస్తుందట!

అమ్మ ఆత్మకథ రాసేందుకు కుమార్తె సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఎవరి ఆత్మ కథ ఎవరు రాస్తున్నారనే కదా.... ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉండాలి. ఓ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆత్మకథను ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాయనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సోనియానే స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. కాగా అన్ని వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకు తాను కూడా పుస్తకం రాస్తానని సోనియా రెండు రోజుల క్రితం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మాజీ కేంద్ర మంత్రి నట్వర్‌సింగ్‌, సోనియా ప్రధాని కాలేకపోవడానికి రాహుల్‌ గాంధీనే కారణమనీ, తన నానమ్మ ఇందిరాగాంధీలా తన తల్లి సోనియా కూడా రాజకీయ కుట్రలకు బలైపోతారన్న ఆవేదనతోనే రాహుల్‌, తన తల్లి ప్రధాని కాకుండా అడ్డుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. దీనిపై సోనియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా జీవిత చరిత్ర నేనే రాసుకుంటాను.. అందులో తానెందుకు ప్రధాని కాలేకపోయానో వెల్లడిస్తాను.. ఆ విషయమై ఇతరులెవరూ మాట్లాడకపోతేనే మంచిది అంటూ సోనియా నట్వర్‌సింగ్‌పై మండిపడ్డారు. ఇంతకీ నట్వర్‌సింగ్‌ వ్యాఖ్యలపై సోనియాగాంధీకి ఎందుకు అంత కోపమొచ్చినట్లు.? నిజంగానే సోనియా జీవిత చరిత్రను ప్రియాంకా గాంధీ రాస్తే అందులో అమ్మ ప్రధాని కాలేకపోవడానికి గల కారణాల్ని వివరిస్తారా.? అనేది వేచి చూడాల్సిందే.

 

మరోవైపు సోనియా గాంధీ తన ఆత్మకథను తానే రాసుకుంటానన్న వ్యాఖ్యలపై నట్వర్ సింగ్ స్పందించారు. సోనియా నిర్ణయం సంతోషకరమన్నారు. ఆ ఆత్మకథ కోసం తాను ఎదురు చూస్తుంటానన్నారు. ప్రియాంకా గాంధీ తాజాగా తెరమీదకు రావటంతో ఆత్మకథ ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది.
 

మరిన్ని వార్తలు