అయోధ్యలో రామభక్త ప్రియాంక పోస్టర్లు..

25 Mar, 2019 18:14 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అయోధ్య పర్యటన నేపథ్యంలో ఆమెను రామభక్తురాలిగా పేర్కొంటూ అయోధ్యలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో ప్రియాంక, రాహుల్‌ ఫోటోల మధ్యలో శ్రీరాముడి ఫోటోను ఉంచారు.  ఈనెల 27 నుంచి అయోధ్యలో తన ప్రచారాన్ని ప్రారంభించే ప్రియాంక గాంధీ వరుసగా అమేథి, రాయబరేలి, బారాబంకి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ర్యాలీలు, రోడ్‌షోలు చేపట్టనున్నారు.

కాగా ప్రియాంక అయోధ్య పర్యటనను యూపీ మంత్రి మొహిసిన్‌ రజా తప్పుపట్టారు. రాముడి ఉనికిని ప్రశ్నించిన వారిప్పుడు అయోధ్యను సందర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో రాహుల్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌ చీఫ్‌ను రాముడిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు పోస్టర‍్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ పోస్టర్లలో రాహుల్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీని పదితలలతో కూడిన రావణాసురుడిగా అభివర్ణించారు. ఇదే పోస్టర్‌పై మోదీని ఉద్దేశించి కాపలాదారే దొంగ అనే క్యాప్షన్‌ను జత చేశారు.

మరిన్ని వార్తలు