‘మోదీ గొప్ప నటుడు’

17 May, 2019 19:04 IST|Sakshi

లక్నో : సార్వత్రిక ఎన్నికల తుది పోరులో ప్రచార పర్వం ముగింపు నేపథ్యంలో శుక్రవారం మాటల తూటాలు పేలాయి. కాం‍గ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ ప్రియాంక గాంధీ ప్రధాని మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో జరిగిన రోడ్‌షోలో మాట్లాడిన ప్రియాంక ప్రధాని మోదీ గొప్ప నటుడని ఎద్దేవా చేశారు.

‘మీరు గొప్ప నటుడిని ప్రధానిగా ఎంచుకున్నారు..అమితాబ్‌ బచ్చన్‌ను మీరు ప్రధానిగా ఎన్నుకున్నా బాగుండే’దని అన్నారు. ఏమైనా వారిద్దరూ మీకు ఏమీ చేసేవారు కాదని చెప్పుకొచ్చారు. మోదీ హయాంలో యువత నిరుద్యోగులుగా బాధపడుతున్నారు..రైతులూ సమస్యలతో సతమతమవుతున్నారు..12,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ నాయకుడు కాదని, ఆయన కేవలం నటుడేనని తాను నమ్ముతానని చెప్పారు. యూపీలోని 13 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈనెల 19న తుదివిడతలో పోలింగ్‌ జరగనుంది. ఇక ఈనెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

>
మరిన్ని వార్తలు