జన విస్ఫోటనంతో వచ్చే సమస్యలు ఇవే!

20 Jun, 2019 18:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత దేశంలో సంతానోత్పత్తి తగ్గుతూ వస్తున్నప్పటికీ 2026వ సంవత్సరం నాటికి దేశ జనాభా 165 కోట్లకు పెరుగుతుందని, 2027 నాటికి దేశ జనాభా చైనా జనాభాను అధిగమిస్తుందని ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించిన విషయం తెల్సిందే. జనాభా పెరుగుదల వల్ల మనకొచ్చే లాభనష్టాలు ఏమిటీ ? 

‘డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌’ ద్వారా భారత్‌కు ప్రయోజనమని, ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందని అగ్ర రాజ్యాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. జనాభా పెరగడం వల్ల పనిచేసే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని, వారి శ్రమ వల్ల ఆర్థికవృద్ధి రేటు పెరుగుతుందని ఆ దేశాల వాదన. 15–64 మధ్య వయస్కులను పనిచేసే వారిగా పరిగణిస్తున్నారు. వారి సంఖ్య 1963 నాటికి మొత్తం జనాభాలో 65 శాతం ఉంటుందని అంచనా. అంతమంది పనిచేస్తే ఆర్థిక వృద్ధి రేటు ఆశించిన దానికన్నా ఎక్కువనే సాధించవచ్చేమోగానీ వారందరికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం, వారి ఉపాధి అవకాశాలు కల్పించడం ముఖ్యం. 

2100 సంవత్సరం నాటికి కూడా పురుషులకన్నా మహిళల సంఖ్య తక్కువగా ఉంటుందని సమితి నివేదిక వెల్లడించింది. 2011లో జరిగిన జనాభా లెక్కల నాటికి  ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా, ప్రస్తుతం ప్రతి వెయ్యి మంది పురుషులకు మహిళల సంఖ్య 924 ఉంది, ఇప్పుడిప్పుడే మహిళల సంఖ్య పురుషులతో పోలిస్తే కొద్ది కొద్దిగా పెరుగుతోందని, ఇక ముందు ఇంకా పెరుగుతుందని, అయినప్పటికీ ఇరువురి మధ్య ఉన్న వ్యత్యాసం తొలగిపోయే అవకాశం లేదన్నది అంచనా. అప్పటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు 966 మంది మహిళలు ఉంటారన్నది అంచనా.

1950 నాటికి గ్రామీణ ప్రాంతాలు మరింత తగ్గిపోయి పట్టణ వాసుల సంఖ్య మరింత పెరిగిపోతుంది. పట్టణాల్లో ప్రాథమిక సదుపాయాలు కల్పించడం ఓ సవాల్‌గా మారుతుంది. జనాభా పెరుగుదలతో కాలుష్యం పెరుగుతోంది. ఇప్పటికే తగ్గిపోతున్న భూగర్భ జలాలతో పడుతున్న తిప్పలు అధిక జనాభాతో మరింత పెరుగుతాయి. మెట్రో, బస్సు సర్వీసులను విస్తరించకపోతే మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ముంబై, మద్రాస్‌ లాంటి నగరాలో అవి కిక్కిరిసి నడుస్తున్నాయి. 

మరిన్ని వార్తలు