లక్నో : పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో యూపీలోనే అత్యధికంగా 19 మంది మరణించగా, 1000 మందికి పైగా అల్లర్ల కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ప్రార్ధనల దృష్ట్యా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భద్రతా బలగాలు ఫ్లాగ్మార్చ్ నిర్వహించాయి. మరోవైపు గతవారం జరిగిన హింసలో యూపీలో 19 మంది మరణించారని హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో 288 మంది పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లతో సంబంధముందనే ఆరోపణలపై 1,113 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 327 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని హోంశాఖ ప్రతినిధి తెలిపారు. అల్లర్లు చెలరేగకుండా నిరోధించేందుకు 5,558 ముందస్తు అరెస్ట్లు జరిగాయని చెప్పారు.