వైరల్‌: అలా చేస్తే ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్‌ ‘కొట్టేయొచ్చు’

21 Feb, 2020 15:42 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఓ మెషీన్‌ అటు ప్రయాణికులను, ఇటు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎలాంటి ఖర్చూ లేకుండా ఆ మెషీన్‌ ఉచితంగా ప్లాట్‌ఫాం టికెట్లు అందిస్తోంది. దాంతో అక్కడ ఉచిత టికెట్ల కోసం కాసింత ఒళ్లు వంచుతున్నారు. ఇంతకూ విషయమేంటంటే ఫిట్‌నెస్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్రీగా ప్లాట్‌ఫాం టికెట్‌ ఇచ్చే యంత్రాన్ని నెలకొల్పారు. ఆ యంత్రం ఎదురుగా నిలుచుని కొద్దిదసేపు సిట్‌ అప్స్‌ చేస్తే చాలు.. మెషీన్‌ ఉచిత ప్లాట్‌ఫాం టికెట్‌ ఇచ్చేస్తుంది.

ఇక ఈ విషయానికి సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ఫిట్‌నెస్‌తో మనీ సేవ్‌ చేసుకోండని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ఫిట్‌నెస్‌ను పోత్సహించేందుకు ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ రైల్వే స్టేషన్‌లో ఒక అసాధారణ ప్రయోగానికి శ్రీకారం చుట్టాం’అని పేర్కొన్నారు. వీడియోలో ఓ వ్యక్తి మెషీన్‌ ఎదురుగా నిలుచుని కాసేపు సిట్‌ అప్స్‌ చేయడంతో.. అతనికి ఉచిత ప్లాట్‌ఫాం టికెట్‌ లభించింది. ఈ వీడియో ట్విటరటీ దృష్టిని ఆకర్షించింది. గంటల వ్యవధిలోనే అది వైరల్‌ అయింది. 1.5 లక్షల వ్యూస్‌, 29 వేల లైకులు, 10 వేల రీట్వీట్లతో అది దూసుకుపోతోంది. అద్భుతం అని కొందరు. ఫిట్‌నెస్‌పై అవగాహనకు అద్భుతమైన చొరవ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ‘విదేశాల్లో అమల్లో ఉన్న ఇలాంటి ప్రయోగాలు తొలిసారి భారత్‌లో ప్రవేశపెట్టారు. థాంక్యూ సర్‌’అని ఓ నెటిజన్‌ ధన్యవాదాలు చెప్పారు.

>
మరిన్ని వార్తలు