నేడు నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ సీ–48

11 Dec, 2019 05:20 IST|Sakshi
ప్రయోగానికి సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ సి–48 రాకెట్‌

మధ్యాహ్నం 3.25 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగం

576 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి రీశాట్‌–2బీఆర్‌1 ఉపగ్రహం  

అమెరికా, జపాన్, ఇటలీ,ఇజ్రాయెల్‌ ఉపగ్రహాలు సైతం  

ఇది చరిత్రాత్మక ప్రయోగమన్న ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌

సూళ్లూరుపేట/తిరుమల:  పీఎస్‌ఎల్‌వీ సీ–48 ఉపగ్రహ వాహక నౌక బుధవారం సాయంత్రం 3.25 గంటలకు నింగిలోకి దూసుకుపోనుంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లోని(షార్‌) మొదటి ప్రయోగ వేదిక నుంచి రోదసీలోకి పంపేందుకు ఇస్రో ఏర్పాట్లు పూర్తిచేసింది. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ సమక్షంలో కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభించారు.

పీఎస్‌ఎల్‌వీ సీ–48 ద్వారా 648 కిలోల బరువు కలిగిన రీశాట్‌–2బీఆర్‌1 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన 4 లీమూర్‌ అనే ఉపగ్రహాలు, టైవోక్‌–0129, ఆరు ఐహోప్‌శాట్‌ ఉపగ్రహాలు, జపాన్‌కు చెందిన క్యూపీఎస్‌–సార్, ఇటలీకి చెందిన తైవాక్‌–0092, ఇజ్రాయెల్‌కు చెందిన డచీఫ్యాట్‌–3 అనే ఉపగ్రహాలను 576 కి.మీ. ఎత్తులోని సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కాగా, ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ–48 రాకెట్‌ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు నిర్వహించారు. ఇది ఇస్రోకు చరిత్రాత్మక ప్రయోగమన్నారు. 

>
మరిన్ని వార్తలు