తీవ్ర అసంతృప్తిలో పరుగుల రాణి

1 May, 2016 11:04 IST|Sakshi
తీవ్ర అసంతృప్తిలో పరుగుల రాణి

న్యూఢిల్లీ: ఒలింపిక్ అర్హత సాధించడం కోసం నిర్వహించే పోటీలు(ఫెడరేషన్ కప్) ఢిల్లీలో నిర్వహించడంపట్ల ఒకప్పటి పరుగుల రాణి పీటీ ఉష అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత కలుషిత వాతావరణం కలిగిన ప్రాంతమైన ఢిల్లీలో క్వాలిఫైయింగ్ క్రీడలు నిర్వహించడం క్రీడాకారులకు ఇబ్బంది అని ఆమె అన్నారు. అసలు ఇక్కడ వారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు.

'ఒలింపిక్ క్వాలిఫైయింగ్ క్రీడల నిర్వహణ కోసం ఢిల్లీని ఎంచుకోవడం నాకు చాలా అసంతృప్తిగా ఉంది. ఢిల్లీ దుమ్ముధూళితో నిండిన భయంకరమైన వాతావరణం కలిగినది. దాదాపు అందరూ అథ్లెట్లు ముఖాలకు ముసుగులు ధరించి శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఆక్సిజన్ ఎలా అందుతుంది? వారు ఈ వెంట్ ను మరో ప్రాంతంలోగానీ, లేదా మరోసమయంలో గానీ నిర్వహిస్తే బాగుంటుంది' అని పీటీ ఉష చెప్పారు. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ప్రస్తుతం ఈవెంట్ నిర్వహిస్తున్న ప్రాంతంలో గాలి స్వఛ్ఛత చాలా బలహీనంగా ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు